-పతి కోసం సతీమణి విజ్ఞప్తి!
మా ఆయనను గెలిపించి మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి
-24వ వార్డులో మాజీ కౌన్సిలర్ రాపల్లి లావణ్య ప్రచారం..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. శుక్రవారం బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ గెలుపును కాంక్షిస్తూ ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ రాపల్లి లావణ్య వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళా ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రచారంలో భాగంగా లావణ్య ప్రతి ఇంటి గడపను తడుతూ మహిళలకు ఆత్మీయంగా తిలకం దిద్దారు. వార్డు అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ, స్థానికంగా అందుబాటులో ఉండి సేవ చేసే గుణం ఉన్న రాపల్లి శ్రీధర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.గతంలో కౌన్సిలర్గా తాము చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూనే, రాబోయే రోజుల్లో వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, మహిళా కార్యకర్తలు బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రచారానికి వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
